Monday, April 4, 2011

కొసరాజు రాఘవయ్య చౌదరి

 కొసరాజు రాఘవయ్య చౌదరి

కలంపెరు        : ‘కొసరాజు"
జననం           ;1904
జన్మ స్థలం      : అప్పికట్ల, బాపట్ల తాలూక, గుంటూరు జిల్లా.
విద్యాభ్యాసం    ; సంస్కృతాంధ్రములు,
                     గురువులు: కొండముది నరసింహం పంతులు
                                    కవిరాజు రామస్వామి చౌదరి
బిరుదము      ; కవిరత్న
రచనలు         : మిత్రనీతి, కడగండ్లు
                    గండికోట యుద్ధము, కొండవీటి చూపు,
                    సినిమా డైరెక్టరు, భాను గీత, రాఘవయ్య శతకం,
                    వీరశేఖర శతకం, కొరడాకుచ్చులు, కొసరాజు గేయాలు,
                    రాష్ట్రగీత.
ఇతర విశేషాలు:  పండ్రెండవయేటనే కవిత్వము చెప్పుట ప్రారంభించి, ‘బాలకవి’ అను బిరుదు పొందిరి. పదుమూడవయేట అష్టావధాన, శాతావధానములు చేసి సభలలో గౌరవ సన్మానాలు పొందిరి. అనేక సభలలో వేయిన్నూటపదహార్లు బడసిరి. తిరుత్తని రైతు మహాసభలో అప్పటి బీహారు గవర్నర్ శ్రీమాన్ మాడభూషి అనంతశయనం అయ్యంగారిచే “కవిరత్న” అను బిరుదుచే గౌరవింఫబడిరి. మద్రాసు ప్రొవిన్షియల్ వార్ కమిటీవారు ఏర్పరచిన యాంటీ ఫాసిస్ట్ గీతాల పోటీలో అప్పటి గవర్నర్ సర్ ఆర్ధర్ హోప్ గారిచే సువర్ణ పతకాన్ని పొందిరి.
ఆంధ్ర సినిమా రంగంలో ప్రవేశించి అనేక చిత్రాలకు, శతదినోత్సవ, రజతోత్సవాలు బడసిన చిత్రాలకు ప్రసిద్ధమగు పాటలు వ్రాసి మంత్రులచేతను, ప్రజానాయకులచేతను ఎన్నో సువర్న, రజిత షీల్డులను బడసిరి.

వీరు వ్రాసిన “రోజులు మారాయి” చిత్రంలోని “ఏరువాక” పాట హింది, మహరాటా, సిలోన్, మళయాళీ,తమిళ, కన్నడ భాషలలో కాపీచేయబడి భారతదేశంలోనే గొప్ప పాటగాబహుళ ప్రచారం పొందినది.
తెలుగు చిత్రసీమలో “కొసరాజు” అను కలంపేరుతో వీరు ప్రజలకు సుపరిచితులు. వీరి కవిత్వంలో జాతీయత తొణికిసలాడుచుండును. ప్రజలకు సుగమమగు సాహిత్యం అందజేయుటలో వీరిది అందెవేసినచేయి. జానపద సాహిత్యానికి చక్రవర్తులని ప్రసిద్ధి.
జానపద కవిసార్వభౌముడు 'కొసరాజు'
''పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు'' అని స్వయంగా ప్రకటించుకున్న జానపద గీతాల రారాజు గురించి ఎంతరాసినా తక్కువే. తెలుగు పదం, తెలుగు పద్యం, తెలుగు తనం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా..., సరిగంచు చీరగట్టి... శివగోవింద గోవింద, డబ్బులోనె ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు... ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మూడువేలకు పైగా గీతాలు రాసి 'కవిరత్న'గా, 'జానపద కవి సార్వభౌముడు'గా పండిత పామరుల మన్ననలు పొందినవారు కొసరాజు రాఘవయ్య చౌదరి.
జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం, రైతు ఉద్యమం ముప్పేటగా ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేస్తున్న రోజుల్లో అంటే... 1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలంలోని మాతామహుల గ్రామమైన చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. వారి ప్రాథమిక విద్య జమ్మలమడక శీనయ్యపంతులు వద్ద సాగింది. ఆ తర్వాత కొండముది నరసింహంపంతులు, త్రిపురనేని రామస్వామిచౌదరి వద్ద విద్యనేర్చారు. చిన్నతనంలోనే భారత భాగవతాలు చదువుకున్నారు. కొన్నాళ్ళు తెనాలి నుంచి వచ్చే ''రైతు పత్రిక''లో పనిచేశారు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు తొలిసారిగా కొసరాజు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు. అక్కడ ఉన్న ఆయన ''రైతు ఉద్యమం''లో పాల్గొన్నారు. రైతుల కోసం కడగండ్లు'' పేరుతో గేయాలు రాశారు. ఆ గేయాలు అప్పటి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా నచ్చాయి. ఫలితంగా వెయ్యిన్నొక్క రూపాయలతో కొసరాజుకు తొలిసారిగా సత్కారం జరిగింది''.
1932 ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతంలో తుపాను తీవ్ర నష్టం కలిగించింది. వ్యవసాయశాఖ ప్రోత్సాహంతో ''వడ్లు పండించవద్దు'' అంటూ పాటలురాసి ప్రచారం చేశారు కొసరాజు. ఆ తర్వాత రైతు ఉద్యమానికి పాటలు రాశారు. అవన్నీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. 1938లో గూడవల్లి రామబ్రహ్మం ''రైతుబిడ్డ'' సినిమా ప్రారంభించారు. అందులో కొసరాజు కొన్ని పాటలు రాయడమేకాక నటించారు కూడా. తర్వాత ''అపవాదు'' చిత్రానికి కొన్ని పాటలు రాశారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో అప్పట్లోనే గుంటూరు తిరిగొచ్చేశారు. ఇన్సూరెన్స్‌ ఉద్యోగిగా జీవితం ప్రారంభించారు. మరోవైపు ''ప్రజామిత్ర'' మొదలైన పత్రికల్లో రాష్ట్ర గీతాలు రాశారు.
1952లో ఆయన కోర్టు పనిమీద మద్రాసు వెళ్ళారు. కోర్టు పనిమీద వెళ్ళిన కొసరాజుకు అక్కడ డి.వి.నరసరాజు తటస్థపడ్డారు. ''పెద్దమనుషులు'' చిత్రానికి పాటలు రాయాలని ఆయన కె.వి.రెడ్డి దగ్గరకు కొసరాజును తీసుకెళ్ళారు. అంతే... 1953 నుంచీ 1986 అక్టోబరు 27 వరకూ ఆయన మూడు వేలకు పైగా పాటలు రాశారు.
కొసరాజు సినిమా గీతాలు మినహా మరేమీ రాయలేదనుకుంటే పొరబడినట్లే. ఆయన సినిమా పాటలు, అద్భుతమైన ఆయన కావ్యాలను మింగేశాయి. కొసరాజు జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం ప్రేరణతో రాసిన కావ్యాలు - ''గండికోట యుద్ధం'', ''కొండవీటి వైభవం''. ఈ రెండు కావ్యాల్లోనూ పద్యాలు తేలికైన పదాలతో మధురంగా సాగుతాయి. సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ మాటల్లో చెప్పాలంటే ''కొసరాజులో గురజాడ, గిడుగుల భాషావిప్లవముంది. కవిరాజు త్రిపురనేని భావవిప్లవపువేడి ఉంది. నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా కన్నీటితడి ఉంది. అప్పటి స్వాతంత్య్ర సమరోత్సాహాల, ప్రజాభ్యుదయాల ప్రభావం ఉంది. కనుకనే ఆయన భావాలు ప్రజాహితాలు, ఆయన భాష పల్లెసీమ హృదయనాదం''.
కొసరాజు స్వతంత్ర శతకాలు కూడా రాశారు. ''శంభుకర్షిప్రభుశతకం, మిత్రనీతి, వీరశేఖర శతకం, భానుగీత, సినిమాడైరెక్టరు, కొసరాజు విసుర్లు-'' ఇవన్నీ ఆయన కలం నుంచి వెలువడిన శతకాలే. అలాగే- బంగారువాన, కడగండ్లు, చిట్టిచెల్లి, రాష్ట్రగీతికలు, కాకర్ల గోపాలనాయుని వంశ చరిత్ర, నవభారతం వంటి ఎన్నో లఘురచనలు చేశారు. పల్నాటి ప్రతిభ, శివాజి, ఫాసిస్టుగీతాలు, దేవునిమొర, సుస్వాగతము, కుప్పుస్వామి చౌదరి, ఆనందబాష్పాలు... వంటి ఎన్నో లఘు రచనలు ఇంకా అముద్రితాలుగా ఉన్నాయి. వీటన్నిటితోపాటు ఆయన తన స్వీయచరిత్ర కూడా రాశారు. బుర్రకథలు రాయడంలో ఆయన దిట్ట. ఎన్నికలకు, సినిమాలకు ఎన్నో రాశారు. తెలుగు సాహిత్యంలో వివిధ సాహిత్యప్రక్రియలు చేపట్టి తన ప్రతిభేమిటో నిరూపించారు కొసరాజు. ఆయన తెలుగునాడు వినిపించే పలుకుబడులకు, సామెతలకు, నుడికారాలకు కావ్య గౌరవం కల్పించారు. ఆయన భాష సరళం. భావం సుకుమారం, పద్యకావ్యాలైనా, సినిమా గేయాలైనా, మళ్ళీ మళ్ళీ చదవాలని, వినాలని కోరుకునేలా రాశారు కొసరాజు.
ఆయన పొందిన సత్కారాలు అనేకం. ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ నిర్వహించిన బుర్రకథల పోటీలో ''నవభారతం'' బుర్రకథకు ఆయన ప్రథమ బహుమతి పొందారు. అఖిలభారత కాంగ్రెస్‌, ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఆయన్ని ఘనంగా సత్కరించాయి. తెనాలి క్లాసికల్‌ ఫిలిమ్‌ సొసైటీ నుంచి సముద్రాల రాఘవాచారి అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ అందుకున్నారు.
''వ్రాసిన మాటలే వ్రాయుట కంటె, పాడిన పాటలే పాడుట కంటె, సరికొత్త రచనల సాగించినపుడె, కవి చమత్కారాన కథ రక్తికట్టు''- అంటూ నవ్యతకోసం పరితపించిన కొసరాజు తెలుగుభాష ఎంత కమ్మగా, కమనీయంగా ఉంటుందో తన రచనల్లో చూపారు. ''జాను దేశి కవిత నా నుడికారమ్ము, ఏ నిఘంటువులకు నెక్కకుండు, చిన్ననాటి నుండి జీర్ణించుకొన్నాను, పల్లెపదములన్న పరమ ప్రీతి''- అన్నట్లుగానే ఆయన రచనల్లో వందల సామెతలు, జాతీయాలు, పలుకుబడులు కనిపిస్తాయి.
ఇక సినిమా పాటల్లో ప్రబోధగీతాలు, సామ్యవాద గీతాలు, లోకంపోకడ తెలిపేవి, భవిష్యత్తును తెలిపేవి, పల్లెపదాలు, వ్యవసాయానికి, రైతులకు సంబంధించినవి, హాస్యగీతాలు... ఎన్నో రాశారు. జానపదగీతాల్లోని పల్లవులను, పలుకుబడులను బాణీలను, పొడుపుకథలను ఉపయోగించి తెలుగుసినిమా పాటలను ఆయన సారవంతం చేశారు. యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.
ఆయన తెలుగువాడిగా పుట్టినందుకు అనేక సందర్భాల్లో ఎంతో గర్వించారు. ఎన్నో పద్యాలు రాశారు. ''రైతు జన విధేయ రాఘవయ్య'' మకుటంతో రాసిన శతకంలో ఆంధ్రప్రదేశ్‌కి, తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తిచాటారు. ''సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు, హిందియనుచు గంతులిడు నొకండు, తెలుగుకొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె...' అంటూ వాపోయారాయన.
అభ్యుదయకవిగా, ప్రజాకవిగా, రైతుపక్షపాతిగా ఆంధ్రసాహితీ మాగాణంలో తెలుగునుడికారపు పంటలు కొల్లలుగా పండించిన కొసరాజు 1986 అక్టోబరు 27 రాత్రి పది గంటలకు పరమపదించారు. ఆయన హేతువాది. ఏరువాక... ఏటినీరు ఉండేంతవరకు కొసరాజే రసరాజు.
                  చీకోలు సుందరయ్య 

No comments:

Post a Comment